Thursday 10 September 2015

నీలీ - ఆకుపచ్చ (భూమికి పునరాగమనం)

జె.వి.పబ్లికేషన్స్ నుండి వస్తోన్న కొత్త సైన్స్ ఫిక్షన్ నవల

నీలీ - ఆకుపచ్చ
(భూమికి పునరాగమనం)


అంగారక యాత్ర ముగించుకుని హనీ ఆమ్రపాలి భూమికి తిరిగొచ్చాడు. అసలు కుజగ్రహానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒక కలని నిజం చేసుకోవాలని. ఎన్నో సంవత్సరాల నుంచి స్వప్నాలలో ప్రత్యక్షమై అతన్ని ఆకర్షించి, శాసించి కుజగ్రహానికి రప్పించుకుంది అందాలరాశి అయిన 'సయోనీ'. ఆమెపై మోజుతో అక్కడికి వెళ్ళిన హనీ భ్రమలు తొలగిపోతాయి, అరుణ భూముల చక్రవర్తి సమూరా చేతిలో బందీ అవుతాడు. కుజుడి మీద ఉన్న ఒలింపస్‌ శిఖరం మీద దాచబడి ఉన్న అమరత్వం ప్రసాదించే ఔషధాన్ని తెచ్చి తనకివ్వాలని ఒత్తిడి చేస్తాడు సమూరా. ఎలాగొలా దాన్ని తెచ్చిస్తాడు హనీ. ఆ తరువాత మానవ కాలనీకి, మాంత్రిక రాజ్యం అరుణ భూములకి మధ్య ఎప్పట్నించో ఉన్న వైరం అకస్మాత్తుగా యుద్ధ రూపంలోకి మారడంతో, హనీ ఆ యుద్ధంలో పాలుపంచుకుంటాడు. కుజగ్రహపు మాంత్రికుల వద్ద శిక్షణ పొంది విశ్వశక్తిని కరతలామలకం చేసుకుంటాడు హనీ. ఈ క్రమంలో తనలో జన్యుసంబంధమైన ప్రత్యేక శక్తి వుందని, అది తనకి పుట్టుకతోనే లభించిందని తెలుసుకుంటాడు. అమృత ఔషధం తాగితే శక్తులు నశిస్తాయన్న నిజాన్ని దాచిపెట్టి, సమూరా ఆ ఔషధాన్ని సేవించేలా చేస్తాడు హనీ. దాంతో విశ్వాన్ని జయించాలన్న తన ఆశయం నెరవేరకపోయేసరికి హనీ మీద పగ పడతాడు సమూరా. కుజుడి మీద మానవులకి, అరుణ భూముల పాలకులకి మధ్య సంధి కుదిర్చి, అరుణ భూములకు తన స్నేహితుడు మీరోస్‌ని ప్రభువుగా చేస్తాడు హనీ. కుజగ్రహంమీద మానవులు హనీని సత్కరిస్తారు.. కాని చివరికి వాళ్ళు కూడా హనీని అనుమానించి వెంటాడుతారు. గురుడి ఉపగ్రహం గ్వానిమెడ్‌ నుంచి వచ్చిన ఏనిమాయిడ్‌‌ని మానవ సైనికాధికారి జనరల్‌ గ్యానీ అశ్వశాలనుంచి రక్షించే క్రమంలో మానవులకీ శత్రువవుతాడు. ఎలాగొలా తప్పించుకుని భూమికి చేరుతాడు.
తిరిగొచ్చాకా, ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా తన ఉద్యోగంలో కొనసాగుతూంటాడు. అయినా గ్రహాంతర దుష్ట మాంత్రికులు అతనిని వెంటాడడం ఆపరు. అతని గదిలో దొంగతనం జరుగుతుంది, అతని జీవితమే ప్రమాదంలో పడుతుంది. గ్రహాంతర దుష్ట మాంత్రికులే కాకుండా, ఎర్త్ కౌన్సిల్ కూడా హనీ ఆమ్రపాలికి అడ్డు తగులుతూనే ఉంటుంది.. భూమి మీద విశ్వశక్తిని ప్రయోగించడం నిషేధించిన కారణంగా ఎర్త్ కౌన్సిల్ హనీని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది.

"కుజుడి కోసం" నవలకిది అద్భుతమైన కొనసాగింపు నీలీ - ఆకుపచ్చ... కథాస్థలం ఈసారి భూగ్రహం! హానీని వెంటాడి వేధించి పాపిష్టి పనులకు వాడుకోవాలని చూస్తారు కుజగ్రహపు దుష్ట మాంత్రికులు. అయితే ఇప్పుడు కూడా హనీదే గెలుపు..

చదవండి... మరో లోకాలకి తీసుకెళ్ళే ఈ సైన్స్ ఫిక్షన్‌ని!

డా. చిత్తర్వు మధుగారు రచించిన సైన్స్ ఫిక్షన్ నవల "కుజుడి కోసం"కి కొనసాగింపుగా వస్తోన్న కొత్త పుస్తకం... నీలీ – ఆకుపచ్చ నవల త్వరలో మీ ముందుకు రాబోతుంది.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008